కూటమిలో ఎవరికీ మంత్రి పదవులు దక్కుతాయో..?

ఏపీలో కూటమి సంచలన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి స్థానాలు గెలవడం తో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 , 25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 దక్కించుకొని ఆశ్చర్యపరిచారు. జనసేన , టిడిపి , బిజెపి మూడు పార్టీల సమిష్టి కృషి వల్లే ఈరోజు ఎంత పెద్ద విజయం సాధించామని మూడు పార్టీల నేతలు చెపుతున్నారు. అయితే ఇంత పెద్ద విజయం సాధించిన కూటమి..ఇప్పుడు ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తుందో అనేది ఆసక్తి గా మారింది.

ప్రస్తుతం పలువురి పేర్లు వైరల్ గా మారాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో జనసేనకు 6 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ CM పదవి వరించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనానితోపాటు మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. మంత్రి పదవుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, బుద్ధ ప్రసాద్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. ఇటు టీడీపీ నుండి అచ్చెన్నాయుడు, కూన రవి, కోండ్రు మురళి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, RRR, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికీ పదవులు దక్కుతాయో చూడాలి.

ఇక ఈరోజు టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇటు ఇదే అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి వారి అభిప్రాయాలను పవన్ తీసుకోనున్నారు.