భర్త ఇంట్లో భోజనం చేయడం లేదని భార్య ఆత్మహత్య

ఈరోజుల్లో చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటూ వారినే నమ్ముకున్న వారిని శోకసంద్రంలో పడేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు అలాగే చేస్తున్నారు. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని కొంతమంది పిల్లలు , ప్రేమించలేదని యువతీ యువకులు, భార్య – భర్తల మధ్య మనస్పర్థలు ఇలా ఏదొక చిన్న కారణంతో తనువు చాలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మరో విచిత్రం జరిగింది. భర్త ఇంట్లో భోజనం చేయడం లేదని కోపం తో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ గౌరీ శంకర్‌ నగర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

గౌరీ శంకర్‌ నగర్‌లో నివాసం ఉండే సంగీత, సంజీవ్‌ మధ్య నాలుగు రోజుల క్రితం చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి భర్త కోపంతో ఉన్నాడు. ఆమె వండి పెట్టింది తినడం మానేశాడు. ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు. భర్త అలా నాలుగు రోజుల నుంచి తిండీ తిప్పలు లేకుండా తనతో మాట్లాడకుండా ఉండటంతో భార్య సంగీత భరించలేకపోయింది. ఎంత బతిమాలినా దారికిరావడం లేదని మానసికంగా తీవ్ర కలత చెందింది. అంతే ఎవరూ లేని సమయంలో ప్రాణం తీసుకుంది. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసుకోవడం ఏంటని బోరున విలపిస్తున్నారు.