‘చివరి బంతికి సిక్సర్‌ కొడతాం’.. అవిశ్వాస తీర్మానానికి ముందు మోడీ

ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్న ప్రధాని మోడీ

‘We will hit a sixer at the last ball’: PM Modi ahead of no-confidence motion

న్యూఢిల్లీః పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఈ విషయంలో చివరి బంతికి సిక్స్‌ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.

‘‘ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన తీర్మానం.. వారికి ఓ కార్యక్రమం మాత్రమే. కానీ ఇది మనకు మంచి అవకాశం. అవినీతి, కుటుంబ రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్నిఉంచాలన్న ఎన్‌డీఏ నినాదం అలానే ఉంది”అని అన్నారు. అది అహంకారుల కూటమి అని, అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ఇక ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ ప్రారంభించారు. సభలో సంఖ్యాబలం తమకు లేకున్నా.. అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిన పరిస్థితిని తమకు కల్పించారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు మొత్తం 16 గంటల సమయాన్ని స్పీకర్ ఓం బిర్లా కేటాయించారు. బిజెపి, కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 15 మంది ప్రసంగించనున్నారు.