రేపటి మోడీ పర్యటనను తామంతా బహిష్కరిస్తున్నాం: కెటిఆర్
హైదరాబాద్ః హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్తో కలిసి మంత్రి కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజన హామీలను ప్రధాని మోడీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మంత్రి కెటిఆర్ అన్నారు. గుజరాత్కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రేపటి మోడీ పర్యటనను తామంతా బహిష్కరిస్తున్నామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోడీ అని కెటిఆర్ అన్నారు. తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు.
గాంధీ భవన్లో గాడ్సే దూరాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని ఆరోపించారు. భూ దందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి కలిసే పనిచేస్తున్నాయన్నారు. ఆ పార్టీల మోసాలు ప్రజలకు తెలుసని వెల్లడించారు. సిఎం కెసిఆర్ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాల్లో ప్రజలు బిఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని విమర్శించారు. రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆయన ఏ అర్హతతో తమపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్లో రాహుల్ హోదా ఏంటని నిలదీశారు.