మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు ఒకే విడుతలో ప్రారంభమైన ఎన్నికలు
భోపాల్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయింది. మొత్తం 5,60,58,521 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో మహిళా ఓటర్లు 2.72 కోట్ల మంది కాగా, పురుష ఓటర్లు 2.88 కోట్ల మంది ఉన్నారు. వీరికోసం 64,626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఈ సారి 22.36 లక్షల మంది యువతీయువకులు మొదటిసారిగా తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు.
మొత్తం 230 స్థానాలకుగాను 2534 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో 252 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది. బిజెపి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, ఈసారైనా పూర్తి మెజార్టీతో మధ్యప్రదేశ్ అసెంబ్లీని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.