కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో కట్టుదిట్టం చేసారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడలేదని చెప్పారు. రాష్ట్రంలో 79 నియోజకవర్గాల్లో 75% కంటే ఎక్కువ పోలింగ్‌ నమోదైందని పేర్కొన్నారు. పోలింగ్‌ సరళిని పర్యవేక్షించడానికి వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49కేంద్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. 2018 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గిందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర మూడెంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుందన్నారు. 500లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మొదటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించున్నట్లు తెలిపారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ సారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లు లెకిస్తారు. 8.30గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లు లెక్కింపు షురూ అవుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కానట్లయితే…రెండు ఓట్ల లెక్కింపు ప్రక్రియలను సమాంతరంగా నిర్వహిస్తామన్నారు. పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని…పరిశీలకుల ఆమోదం తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ అధికారి తెలిపారు.