ఏపీలో ఆస్తి కోసం హత్య చేసిన వాలంటీర్

వాలంటీర్లలో కొంతమంది చెడ్డపనులు చేస్తున్నారని , బెదిరించి అమ్మాయిలను లోనదీసుకోవడం , పలు అన్యాయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపిస్తుంటే..వైస్సార్సీపీ మాత్రం వాలంటీర్లు ఆలా చేయడం లేదని , వారు చాల మంచివారు అన్నట్లు చెపుతూ వస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఇదే అంశం కాకరేపుతుంది.

ఇదిలా ఉండగా..కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత పెదనాన్నను వాలంటీర్ ప్రవీణ్ దారుణంగా హత్య చేశాడు. పొలం తగాదా నేపథ్యంలో తన పెదనాన్నను హతమార్చడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతుంది. కర్నూలు మండలం నూతనపల్లె గ్రామంలో వాలంటీర్ గా పని చేస్తున్న ప్రవీణ్.. ఇదే గ్రామంలో వారి ఉమ్మడి కుటుంబానికి 4 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతం ఆ గ్రామంలో భూమిని రీసర్వే చేసే కార్యక్రమం జరుగుతోంది.

దీంతో, మనం కూడా భూమిని రీసర్వే చేయించుకుని సమ భాగాలుగా పంచుకుందామని పెదనాన్న స్వామి (55) సూచించారు. దీనికి ప్రవీణ్ ఒప్పుకోకపోవడంతో… కుటుంబంలో గత మూడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో తన సోదరుడు రాజశేఖర్ తో కలిసి పెదనాన్న, ఆయన కుమారుడు బాలస్వామిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో స్వామి చనిపోగా… బాలస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రవీణ్, రాజశేఖర్ తో పాటు వారి తల్లిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.