బిజెపికి రాజీనామా చేసిన వివేక్ వెంకటస్వామి

రాహుల్ గాంధీతో భేటీ.. కాంగ్రెస్ లో చేరనున్న వివేక్

vivek-venkataswamy-resigns-bjp

హైదరాబాద్‌ః మాజీ ఎంపీ, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి రాజీనామా చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు రిజైన్ లెటర్ ను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో వివేక్ వెంకట స్వామి నోవా టెల్ హోటల్ కు వెళ్లి రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 లో వివేక్ పెద్దపెల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) లో చేరారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరోమారు బిఆర్ఎస్ లో చేరిన వివేక్.. ఈ రోజు వరకు బిజెపిలో కొనసాగారు. వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేం లేదని ఆయన కొట్టిపారేస్తూ వస్తున్నారు. తాజాగా, ఆయన తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.