నాణేలతో ఎన్నికల నామినేషన్.. తిరస్కరించిన అధికారులు

election-nomination-with-coins-rejected-in-chhattisgarh

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి నామినేషన్‌ రుసుమును మొత్తం నాణేల రూపంలో ఇవ్వడాన్ని అధికారులు తిరస్కరించారు. అఖిల భారత ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు గణేష్‌ దాస్‌ మహంత్‌….తుల్సీ నగర్‌ బస్తీలోని ఎన్నికల కార్యాలయానికి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లారు. నామినేషన్‌ రుసుమైన 10 వేల రూపాయలను నాణేల రూపంలో సమర్పించారు.

గణేశ్ సమర్పించిన నాణేల్లో మొత్తం రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల కాయిన్స్ ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో చిల్లర చూసిన ఎన్నికల అధికారి షాక్ అయ్యారు. వాటిని లెక్కించడం అంత సులువు కాదని భావించి.. అంత సమయం తమ వద్ద లేదని.. రుసుమును తిరస్కరించారు. కేవలం 1000 రూపాయల వరకు మాత్రమే నాణేల రూపంలో తీసుకోవడానికి అనుమతి ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున గణేశ్ దాస్‌ నామినేషన్‌ వేయలేక వెనుదిరిగారు. నాలుగు సంవత్సరాలుగా డ్రైవర్‌ యూనియన్‌ సభ్యులు ఇస్తున్న వాటిని భద్రపరచడం ద్వారా ఈ నాణేలు లభించినట్లు అతను తెలిపారు.