బిజెపి పార్టీకి విక్రమ్ గౌడ్ రాజీనామా

రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించిన విక్రమ్ గౌడ్

vikram-goud-resigns-from-bjp

హైదరాబాద్‌ః దివంగత ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బిజెపికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్‌ను ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కే పార్టీ మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. తాజాగా, గురువారం ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని… కొద్దిమందికే అన్ని పదవులు కట్టబెడుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. గ్రూపులను కాకుండా పార్టీని నమ్ముకున్న తనలాంటి వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయని… ఇప్పటికీ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆరోపించారు.