ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత

బాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. తన నటనతో యావత్ భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్రమ్ గోఖలే..గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా కారణంగా పూనెలో ఉన్న దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన చనిపోయినట్టు డాక్టర్లు కాసేపటి క్రితమే ప్రకటించారు.

విక్రమ్ మరణంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు షాకయ్యారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విక్రమ్… కొద్ది రోజులుగా కోమాలో ఉన్నారు. ఇటీవల ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అంతలోనే ఆరోగ్య పూర్తిగా విషమించి ఈరోజు కన్నుమూశారు. విక్రమ్ గోఖలే 1971లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పర్వానా’ సినిమాతో కెరీర్‌ని ప్రారంభించారు. ఆయన హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుతంగా నటించారు. అంతేకాకుండా ‘భూల్ భులయ్యా’, ‘మిషన్ మంగళ్’, ‘దే దానా దాన్’, ‘హిచ్కీ’, ‘నికమ్మ’, ‘అగ్నీపథ్’, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు.