‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమానికి జగన్ శ్రీకారం

రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్నలను అందుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..బుధువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుండి ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కొనేవారు ఒక్కడే, అమ్మేవాళ్లు అనేక మంది ఉంటే.. కొనేవాళ్లు ఎంత చెప్తే.. అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇలాంటి మార్కెట్‌ను ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తున్నామన్నారు.

అందుకే ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని, ఇవాల్టి నుంచి కృష్ణా జిల్లాల్లో రైతులకు, మహిళలకు మరింత మంచి ధర లభించనుందని ఆయన అన్నారు. అమూల్‌ ద్వారా పాలసేకరణ ప్రారంభించిన ఏడాది లోగానే 5 జిల్లాల్లో కార్యక్రమం కొనసాగుతుందని, ఇవాళ ఆరో జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు.

పాదయాత్రలో అనేక చోట్ల పాడి రైతులు వచ్చి కలిశారు. మినరల్‌ వాటర్‌ ధరకన్నా పాల ధర తక్కువ ఉందని ఆవేదన చెందారు. అధికారంలోకి రాగానే అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేపట్టాం. పాల ప్రాసెసింగ్‌లో దేశంలోనే అమూల్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అమూల్‌ పాల సేకరణ ధర మిగిలిన వాటికన్నా ఎక్కువ. ప్రపంచంలో అమూల్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప ప్రక్రియ కూడా అమూల్‌లో ఉంది. పాల బిల్లును కూడా పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. మహిళా సాధికారతకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్నాం. అమూల్‌లో పాలు పోసే రైతులే యజమానులు. ఏడాదిలో 182 రోజులు సొసైటీకి పాలు పోసిన రైతులకు బోనస్‌ కూడా లభిస్తుంది. లీటర్‌కు 50 పైసలు చొప్పున బోనస్‌ ఇస్తారు’ అని సీఎం జగన్‌ అన్నారు.