కళ్యాణ్ రామ్ మూవీ లో విజయశాంతి

విజయశాంతి ప్రస్తుతం ఓ పక్క రాజకీయాలు , మరోవైపు సినిమాల్లో బిజీ కాబోతుంది. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరి..ఆ పార్టీ విజయంలో పాలుపంచుకుంది. తాజాగా ఈమె కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తున్న మూవీ లో కీలక పాత్ర పోషించబోతుంది. మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరూ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, రష్మిక జంటగా నటించారు.

ఇక ఈ సినిమాలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన కొడుకులకు తల్లిగా ఆమె కనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాలో విజయశాంతి కనిపించింది లేదు. గత కొన్నిరోజుల నుంచి ఆమె కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, అవి నిజమో కాదో తెలియలేదు. అయితే కళ్యాణ్ రామ్ సినిమాలో ఆమె నటిస్తోంది కానీ, అది డెవిల్ కాదని మరో కొత్త సినిమా అని తెలుస్తోంది.

ట్విట్టర్ వేదికగా ఆమె తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన కర్తవ్యం సినిమాలోని పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘ నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం..నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం, మల్ల ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు.. 5 దశాబ్ధాల ఈ నా సినీ గమనంలో మీ దీవెనలు ఎన్నటికీ , 1979 నుండి నేటి వరకు ఉన్నట్లు మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంతవరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని విశ్వసిస్తూ .. నందమూరి కళ్యాణ్ రామ్ కు, డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి, నిర్మాత సునీల్ బలుసు గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.