విజయకాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం
న్యూఢిల్లీ : తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనో లెజెండ్. తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. తమిళనాడు రాజకీయాలను విజయకాంత్ ఎంతో ప్రభావితం చేశారు. నాకు మంచి మిత్రుడు.. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. విజయకాంత్ కుటుంబానికి, అభిమానులకు, అనుచరులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు.
కాగా, తమిళ నటుడు విజయకాంత్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో విజయకాంత్ విశేష సేవలందించి, లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అని రాహుల్ తన ట్వీట్లో తెలిపారు.