ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమేనన్న వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నిత్యం విబేధాలు నడుస్తాయనే సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకొచ్చిన కమిటీ..సీనియర్లలో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సీనియర్లను కాదని , టిడిపి నుండి వచ్చినవారికి పదవులు ఇచ్చారని వారంతా మండిపడ్డారు. దీంతో పదవులు అందుకున్న వారంతా తమ రాజీనామాలను అధిష్టానాన్ని పంపారు. ఇదిలా ఉంటె తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమే అన్నారు.

మంగళవారం మీడియా తో మాట్లాడుతూ..తెలంగాణ కాంగ్రెస్ కమిటీల్లో.. గాంధీభవన్ లో ఉంటూ పైరవీలు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై అధ్యయనానికి దిగ్విజయ్ ను నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు. దిగ్విజయ్ సింగ్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ రానున్నారని , తెలంగాణలో పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్ సింగ్ కి పూర్తి అవగాహన ఉందన్నారు. అనేక అంశాలపై ఆయన విచారణ చేపట్టాలని కోరారు. హుజూరాబాద్ లో రేవంత్ ప్రచారానికి ఎందుకు వెళ్లలేదో విచారణ చేయాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు. మునుగోడులో తనను బూతులు తిడుతున్న వారిపై విచారణ చేయాలని డిమాండ్​ చేశారు.

పార్టీ కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదని వెంకట్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు. కాగా, తెలంగాణలో కనీసం మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ అమలవుతోందని.. మన రాష్ట్రంలో మాత్రం ఆ నిబంధన ఎందుకు అమలుకావడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.