రేపటి నుంచి గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ

రేపటి నుండి గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ చేయబోతుంది తెలంగాణ సర్కార్. కామారెడ్డి నుంచి వర్చువల్‌గా మంత్రి హరీశ్‌రావు ఈ కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు. గర్భిణుల్లో పోషకాహార లోపం నివారణకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రాథమికంగా తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, వికారాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, గద్వాల, కొత్తగూడెం జిల్లాల్లో ముందుగా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను ప్రవేశపెట్టింది.

ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేయనున్నది. 16 నుంచి 24వారాలు ( రెండో త్రైమాసికం), 27 నుంచి 24 వారాలు (మూడో త్రైమాసికం) ఉన్న గర్భిణులు కిట్‌కు అర్హులని అధికారులు పేర్కొన్నారు. న్యూట్రిషన్‌ కిట్ల కోసం రూ.50కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఒక్కో కిట్‌ రూ.2 వేల వరకు ఉంటుంది. ఇక ఈ కిట్ లో ఆరకిలో నెయ్యి, కిలో ఖర్జూర పండ్లు ఒక్కొక్కటి కిలో చొప్పున రెండు హార్లిక్స్‌ బాటిల్స్‌, ఇతర పోషక పదార్థాలు ఉండనున్నాయి.