కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ..కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు లేఖలో పేర్కొన్నారు. అధికారుల సహకారంతో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని.. గ్రాడ్యుయేట్లు కానివారిని సైతం గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారని ఫిర్యాదు చేశారు. కానీ, అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలపై గానీ, అధికారులపై గానీ నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై ప్రతీ ఫిర్యాదుతోపాటు ఆధారాలను సైతం ఎలక్షన్ కమిషన్‌కు పంపినట్లు లేఖలో ప్రస్తావించారు.

ఐపీసీ సెక్షన్ 171 డీ, రిప్రజెంటేషన్ ఆప్ పీపుల్స్ యాక్ట్ – 1950 ప్రకారం ఇద్దరు తిరుపతి మునిసిపల్ కార్పొరేటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దొంగ సర్టిఫికేట్లతో గ్రాడ్యుయేట్లుగా సర్టిఫై చేసి ఓటు హక్కు కల్పించిన ఈఆర్ఓ, ఏఈఆర్ఓలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మేం అడిగిన గ్రాడ్యుయేట్లు కానీ ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందారన్న సమాచారం మాకు నేటికి ఇవ్వలేదన్నారు. బోగస్ ఓట్లు నమోదు చేసి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.