ఢిల్లీ , హైదరాబాద్ లలో పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన నిందితులకు పదేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన నలుగురు తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఇండియన్ ముజాహిద్దీన్ తో కలిసి దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఒబేద్ రెహ్మాన్, ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలంకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ నిందితులకు లుంబినీపార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసుతో సంబంధాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిపి భయభ్రాంతులు సృష్టించడంతోపాటు అలజడులు రేపాలని ఇండియన్ ముజాహిద్దీన్ ప్రయత్నించింది. నిషేధ జాబితాలో ఉన్న ఈ సంస్థ తరఫున పని చేసే ఈ నలుగురు సానుభూతి పరులు వారికి దేశంలో పేలుళ్లకు కుట్రలో భాగమయ్యారు. హైదరాబాద్, బెంగళూరు పేలుళ్లలోనూ ఈ నలుగురిపాత్ర ఉన్నట్టు ఎన్ఐఏ రుజువు చేసింది.
గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్సుఖ్నగర్ జంటపేలుళ్లతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయి. వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలోనూ వీళ్ల పాత్ర ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాల్లో ఈ నలుగురి పాత్ర ఉన్నట్టు ఎన్ఐఏ కోర్టులో వాదించింది. దానికి సరిపడా ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది.
హైదరాబాద్ కు చెందిన ఒబేద్ రహమాన్ బీహార్ కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లను 2013లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.