త్వరలో రామగుండంకు వందే భారత్‌ రైలు..

రామగుండం వైపు వెళ్లే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..అతి త్వరలో వందే భారత్ రైలు రామగుండం వైపు పరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సికింద్రాబాద్‌ జంక్షన్‌ నుంచి నాగ్‌పూర్‌ స్టేషన్‌ మధ్య వందే భారత్‌ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వెళ్లేందుకు వయా కాజీపేట, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ స్టేషన్లలో రైలు హాల్టింగ్‌ ఉండే అవకాశముంది.

ఈ మార్గంలో వందే భారత్‌ రైలు ప్రవేశపెట్టడం ద్వారా దాదాపు 4 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సుమారు 580 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో ఇప్పటికే 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ మార్గాల మధ్య వందే భారత్‌ను ప్రయోగాత్మక పరిశీలన(ట్రయల్‌ రన్‌)ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఏ స్టేషన్‌లోనూ వందేభారత్‌ రైలును ఆపకుండా ట్రయల్‌ రన్‌ను పూర్తి చేశారు. ఇప్పటికే 18 మార్గాల్లో ఈ రైళ్లను నడిపిస్తుండగా సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గం 19వది కానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన తో పాటు షెడ్యూల్ ను రిలీజ్ చేయనున్నారు.