రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుండి వంశీ పోటీ – కొడాలి నాని
రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుండి వల్లభనేని వంశీ వైసీపీ తరుపున పోటీ చేయబోతున్నట్లు మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. గురువారం గన్నవరంలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ ప్లీనరీ వేదికగా కొడాలి నాని ఈ ప్రకటన చేశారు. నేతల మధ్య విభేదాలు ఉంటే పిలిచి మాట్లాడతానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని చెప్పడంతో.. నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలు డైలమాలో పడ్డారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి గన్నవరం పార్టీ ఇంచార్జీగా దుట్టా రామచంద్రారావు వ్యవహరిస్తున్నారు. అయితే 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా ఎంట్రీ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ టికెట్ను దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయగా… యార్లగడ్డపై కేవలం 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఇటీవలే యార్లగడ్డ ప్రకటించారు.
తాజాగా గన్నవరం నుంచి వంశీనే పోటీ చేస్తారంటూ నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాని వ్యాఖ్యలతో గన్నవరం వైసీపీలో కలకలం మొదలైంది. వంశీని వ్యతిరేకిస్తున్న దుట్టా, యార్లగడ్డ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇటీవల ఒకేరోజు అటు వంశీ, అటు యార్లగడ్డ, దుట్టా ఘాటైన విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం ఏకంగా సీఎం దగ్గరకు చేరడంతో ఆయన కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్.. వంశీకి అనుకూలంగానే ఉన్నా.. మిగిలిన రెండు వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి మాటను లెక్కచేయడం లేదు. వంశీతో కలిసి నడవాలని అధిష్టానం సూచిస్తున్నా.. తమ వల్లకాదని తేల్చిచెప్తున్నారు. వైసీపీలోనే ఉంటామని.. అదే వంశీ వైసీపీ తరపున పోటీ చేస్తే ఆయన్ను ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు.