చంద్రబాబు కు ఛాలెంజ్ విసిరిన వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..టీడీపీ అధినేత చంద్రబాబు కు ఛాలెంజ్ విసిరారు. మిగతా చోట్ల కాదు కుప్పం లో నీకు గెలిచే దమ్ముందా..? గుడివాడ , గన్నవరం నియోజకవర్గాలను టచ్ చేసి చూడు అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు కాకా మీద ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు తీవ్రంగా కష్టపడుతున్నారు. జనసేన తో పొత్తు పెట్టుకొని , పవన్ కళ్యాణ్ ను సీఎం గా ప్రకటించైనా సరే వైస్సార్సీపీ ని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నాడు. మరోపక్క చంద్రబాబు పలు జిల్లాల పర్యటన చేస్తున్నాడు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నాడు. ఇలా అంత వైస్సార్సీపీ ని టార్గెట్ గా పెట్టుకున్నాయి.

ఇదిలా ఉంటె వైస్సార్సీపీ నేతలు మాత్రం రాబోయే ఎన్నికల్లో 175 కు 175 గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొడాలి నాని , వల్లభనేని వంశీ చంద్రబాబు కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గన్నవరం, గుడివాడ మావి. మా నియోజక వర్గాలను టచ్ చేసే దమ్ముందా? మా సంగతి అటుంచి ముందు మీ గురించి చూసుకోండి, మీ స్థానాల్లో మీరు గెలవగలరా? లేదంటే మాపై పోటీకి దిగే దమ్ముందా అంటూ చంద్రబాబు, లోకేష్‌కు చాలెంజ్‌ విసిరారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అసలు ముందు కుప్పంలో చంద్రబాబు గెలవగలరా? ఆయన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీనే గెలిచింది. ముందు ఆయన సీటు పదిలం చేసుకోవాలంటూ సూచించారు వల్లభనేని వంశీ.