ఉత్తరప్రదేశ్లోని దారుణం.. మహిళలపై పోలీసుల దాడి
లక్నోః ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడిచేశారు. పైపులు, లాఠీలు, కట్టెలతో విరుచుకుపడ్డారు. అంబేద్కర్నగర్ జిల్లా జలాల్పూర్లోని ఓ ప్రాంతంలో ఈ మధ్యే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఆ ప్రాంతం తమదంటూ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీంతో ప్రాంతంపై వివాదం కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రాంతంలో నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీలు, పైపులు, కట్టెలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఓ మహిళను తలపై కొట్టడంతో ఆమె అక్కడే పడిపోయింది. అయితే మహిళలు తమపై ఇటుకలతో దాడిచేశారని, మహిళా అధికారిని జుట్టుపట్టుకుని కొట్టారని పోలీసులు చెప్పారు. ఈనేపథ్యంలో తాము లాఠీలకు పనిచెప్పామన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/