ఇకపై భారత్‌, సింగపూర్‌ల మధ్య క్షణాల్లో డిజిటల్‌ చెల్లింపులు

డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్, సింగపూర్ మధ్య చారిత్రక ఒప్పందం

UPI linked with Singapore’s PayNow; PM Modi says Digital transactions to soon exceed cash in India

న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ఈరోజు భారీ ఒప్పందంపై సంతకాలు చేశారు. భారతదేశం యూపీఏ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, సింగపూర్‌లోని PayNowని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. ఈ ఉదయం రెండు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరు దేశాల అధికారులు డిజిటల్ చెల్లింపు ఒప్పందాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని భారతదేశం నుంచి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.

భారత్, సింగపూర్ మధ్య రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ మొదలు పెట్టారు. దీని ద్వారా, భారత్, సింగపూర్ మధ్య సరిహద్దు కనెక్టివిటీ కింద డబ్బును చాలా సులభంగా, త్వరగా బదిలీ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. బ్యాంకులతో పనిలేకుండానే ఆర్థిక లావాదేవీలను సులభంగా, త్వరగా చేయడానికి అవకాశం ఉండడంతో యూపీఐ సేవలకు మంచి ప్రజాధారణ లభించింది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ సందర్భం ఇరు దేశాలకు ఎంతో అభినందనీయమన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భారత్‌, సింగపూర్ ప్రజలను నేను అభినందిస్తున్నాను. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని ఆయన అన్నారు. ఇరు దేశాల పౌరులు తమ మొబైల్‌లలో ఒకరి దేశాల ప్రజలకు డబ్బును పంపుకోవచ్చు.. స్వీకరించగలరు. విద్యార్థులు, బిజినెస్ చేవారు, సాధారణ పౌరులు దీని ద్వారా ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు.