సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కడుపునిండా సంక్షేమ పథకాలుః మంత్రి కెటిఆర్
హైదరాబాద్ః సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ టెక్ సెల్వింగ్ను మంత్రి కెటిఆర్ నేడు ప్రారంభించారు. ఈసందర్భంగా పలువురు నేతలు మంత్రి సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎటు చూసిన పచ్చదనం, సాగు నీరు, తాగునీరు, సమృద్ధిగా కరెంటు, సుభిక్షంగా పంటలు పండుతున్నాయని, కడుపునిండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైపోతామని కెటిఆర్ అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ప్రజలు ఒక్కసారి ఆలోచించారని చెప్పారు.
ఈ తొమ్మిదిన్నరేండ్లలో సిఎం కెసిఆర్ ఒక్కసారి కూడా కులాల పేరుతో కుంపట్లు పెట్టలేదని, మతాల పేరుతో మంటలు పెట్టలేదని చెప్పారు. ప్రాంతం పేరుతో పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేయలేదని తెలిపారు. అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా పరిపాలన సాగించారని వెల్లడించారు. అలాంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. బిఆర్ఎస్ను ఓడించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు.
మన బతుకులు బాగుచేసిన, తాగు నీరు, సాగునీరు ఇచ్చి మన కండ్లముందే వ్యవసాయాన్ని బాగుచేసిన కేసీఆర్ గురించి తప్ప మరొకరి గురించి ఆలోచించాల్సి అవసరం లేదన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ చేతిలో పెడితే ఆగమైతదని చెప్పారు. ఈ ఎన్నిల్లో సిరిసిల్ల నుంచి మొదలయ్యే జైత్రయాత్రతో రాష్ట్రంలో బిఆర్ఎస్ సెంచరీ దాటాలని, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. సిరిసిల్ల జిల్లాలోని నాలుగు జిల్లాలో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని చెప్పారు. కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. ఏది మంచి, ఏది చెడో సిరిసిల్ల ప్రజలకు తెలుసని మంత్రి కెటిఆర్ అన్నారు.