Auto Draft
కరోనా వలన ఈ ఏడాది వర్చువల్ రీతిలో వజ్రోత్సవ వేడుకలు
ఐక్యరాజ్యసమితి చార్టర్ 1945 అక్టోబర్ 24వ తేదీన ఆమోదించబడింది. ఆ తేదీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయి.
ఈ సంవత్సరం కరోనా వలన వజ్రోత్సవ వేడుకలు వర్చువల్గా జరుగుతున్నాయి. సెప్టెంబర్లో ప్రారంభ మైన ఐరాస సమావేశాల్లో వివిధ రాజ్యాధినేతలు ఉపన్యాసాలిచ్చారు.
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రసంగిస్తూ ప్రపంచం నేడు 1945 నాటి పరిస్థితిని తలపిస్తుందని కరోనా మహమ్మారి, వాతావరణ మార్పులు రెండింటి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
మనం ఎంతో ప్రమాదకర దిశలో ఉన్నామని, రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు భూగోళాన్ని విభజించడాన్ని ప్రపంచం భరించజాలదని,,ఎలాగైనా మరో నూతన ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించాలని ప్రపంచ మానవాళికి విజ్ఞప్తి చేశారు.
దురదృష్టవశాత్తు గుటెరస్ వెలిబుచ్చిన ఆవేదనను నిజం చేస్తూ తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విరుచుకపడ్డాడు.
కరోనా వైరస్కి, వాతావరణ మార్పులకు చైనాయే కారణం అని ఐక్యరాజ్యసమితి వేదికపై చైనాను విలన్గా చూపించే ప్రయత్నం చేశారు.
దాంతో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ప్రసంగిస్తూ ఏకపక్షవాదం, రక్షణవాదం రెండూ చెల్లవని ఆర్థిక ప్రపంచీకరణ నేపథ్యంలో అలా వ్యవహరించడం ఇసుకలో తలదూర్చిన ఉష్ణపక్షి చందంగా ఉందన్నారు.
వీరిద్దరి ఉపన్యాసాలు విన్న ప్రముఖ దేశాధినేతలు అమెరికా-చైనా సంవాదం ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేస్తోందని, ఇది రాబోయే ముప్పుకు సంకే తమని తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
ఈ నేపథ్యంలో కొంత మంది ప్రపంచ మేధావులు ఐక్యరాజ్యసమితి 75 సంవత్సరాల తర్వాత తన ఉనికిని కోల్పోయిందని, దాని అవసరం ఇక లేదని వ్యాఖ్యానించారు.
మరికొంత మంది 75సంవత్సరాలనాటివ్యవస్థను నేటి సామాజిక రాజకీయ మార్పులకు అనుగుణంగా పునర్నిర్మిం చాలని సలహా ఇచ్చారు.
ఈ రెండు దృక్పథాలు వ్యక్తపరచబడు తున్న సందర్భంలో ఐక్యరాజ్యసమితి సాధించిన విజయాలను, ఎదుర్కొంటున్న సవాళ్లను ఒకసారి పునఃపరిశీలించుకుందాం.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం 75 సంవత్సరాల కాలంలో అనేకసార్లు మూడవ ప్రపంచయుద్ధం అంచుకి నెట్టబడ్డ సందర్భం లో మానవాళిని ఆ భయానక పరిస్థితి నుండి రక్షించిన ఘనత ఐక్యరాజ్యసమితిదే.
అంతేగాక అనేక అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించడంలో ప్రధానపాత్ర పోషించింది. ఐరాస శాంతి పరిరక్షకులు 1945 నుండి 60కిపైగా ఫీల్డ్ మిషన్లు నిర్వహించారు.
172 శాంతియుత పరిష్కారాలద్వారా ప్రాంతీయ ఘర్షణలు నివారించగలిగారు.
నేటికీ 20 ఉద్రిక్తప్రాంతాల్లో యుద్ధాలు నివా రణకు, ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిరంతరం కృషి చేస్తు న్నారు.
మరో ప్రధాన విజయం శతాబ్దాల వలసపాలనకు వ్యతి రేకంగా జరిగిన విముక్తి ఉద్యమాలకు తన తోడ్పాటును ప్రకటించి, తత్ఫలితంగా వలసపాలన నుండి దాదాపు 80 దేశాలు, 75 కోట్ల మంది ప్రజలు విముక్తి గావించబడ్డారు.
1948లోమానవ హక్కుల సార్వత్రికప్రకటన అన్నివర్గాల ప్రజల మానవ హక్కుల ను కాపాడటానికి ఐక్యరాజ్యసమితికి తిరుగులేని అధి కారాన్ని అందించింది.
బుత్రోస్ ఘాలి ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో వరుసగా అనేక శిఖరాగ్ర సమావేశాలు నిర్వ హించారు.
అందులో1992లో రియో డి జనీరలో జరిగిన వాతా వరణ మార్పులపై సమావేశం, 1993లో వియన్నాలో మావన హక్కులపై సమావేశం,1995లో కోపెన్హాగెన్లో జరిగిన సామాజిక శిఖరాగ్ర సమావేశం చరిత్రలో మూలమలుపు లాంటివి.
అలాగే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార సంస్థ, కృషి ఎనలేనివి. వాటి కృషి ఫలితంగానే కోట్లాది మంది ప్రజలు అనారోగ్యం, ఆకలి బాధల నుండి విముక్తిగావించబడ్డారు.
పై విజయాలకు తోడు ఇటీవలి కాలంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2000వ సంవత్సరంలో సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాల ప్రకటన, 2015వ సంవత్సరంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకటన ప్రపంచమానవాళికి ఎంతో మేలు చేకూర్చే దిశలో చేసినవే.
అదే సంవత్సరం వాతావరణ మార్పు లపై జరిగిన పారిస్ ఒప్పందం ఐరాస కృషికి నిదర్శనం.
వీట న్నింటితోపాటు 75 సంవత్సరాల కాలంలో మానవ హక్కులు, శరణార్థులు, నిరాయుధీకరణ, వాణిజ్యం, మహాసముద్రాలు, అంతరిక్షం మొదలైన వాటిపై 500పైగా బహుపాక్షిక ఒప్పందాలు ఐరాస పర్యవేక్షణలో జరిగాయి.
ఐరాసలో సోషలిస్టు శిబిరం, అలీన దేశాలు ప్రముఖపాత్ర వహించిన రోజుల్లో అనేక కార్మిక అనుకూలమైన బహుళజాతి సంస్థలను నియంత్రించే తీర్మానాలు చేయబడ్డాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఎంతో ప్రభావితం చేశాయి.
1970లో చేసిన అణ్వాయుధ నిరోధక ఒప్పందం 190 దేశాలు సంతకం చేసినప్పటికీ ఆనాడే ఐదు అగ్రరాజ్యాలు ఆయు ధాలను కలిగి ఉన్నాయి.
తదనంతరం ఉత్తరకొరియా, ఇజ్రాయిల్, పాకిస్థాన్, ఇండియా లాంటి దేశాలు అణ్వాయు ధాలను అభివృద్ధి చేశాయి.
ఒప్పందంలోని అంశాలను అమలు జరపడంలోనూ నూతనంగా అంతరక్షింలో అణ్వాయుధాల ప్రయోగాలనుఅడ్డుకోవడంలో ఐరాస ఘోరంగా విఫలం చెందింది.
1975-79 మధ్య కాంబో డియా ప్రధాని పోల్ పాట్ 25లక్షల మందిని ఊచకోతకోసే నరమేధాన్ని ఆపలేకపోయింది. 1994లో రవాండాలో 8లక్షలమందిని వంద రోజుల్లో హతమార్చేటప్పుడు,
1995లో సెర్బియాలో ఎనిమిదివేల మంది ముస్లింలను ప్రభుత్వ దళాలు చంపేటప్పుడు, డాఫర్లో మూడులక్షల మంది పౌరులను పొట్టన పెట్టుకున్నప్పుడు, ఐరాస ఏమీ చేయలేకపోయింది.
75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఐరాస అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉంది.
అందులో ప్రధాన సమస్య నిధుల కొరత. ఐరాస ఖర్చులలో సింహభాగం 40 శాతం దాకా ఒకప్పుడు అమెరికా భరించేది.
అది కాలక్రమేణా 20 శాతానికి తగ్గించబడింది. ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత 2018లో అమెరికా ప్రభుత్వం ఐరాసకు ఇచ్చిన మొత్తం వెయ్యి కోట్ల డాలర్లు. ఇది అమెరికా విదేశీ సాయంలో ఐదోవంతు.
కేవలం ఆ దేశ కోస్ట్గార్డులకు సంవత్సర కేటాయింపులతో సమానం. కొవిడ్ మహమ్మారి కాలంలో ప్రపంచ ఆరోగ్యసంస్థకు రెండు సంవత్స రాలకు గాను 90 కోట్ల డాలర్లను ఇవ్వనిరాకరించారు.
ప్రస్తుత ఐరాస పద్ధతి ప్రకారం సభ్యదేశాలు స్వచ్ఛందంగా నిధులు కేటాయింపుపై ఐరాస ఆర్థికపరిస్థితి ఆధారపడి ఉంది.
2030 ఎజెండాలో నున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ఎంతోఅవసరం. వాటిలో పేదరికాన్ని రూపుమాపడం, అనారోగ్యాన్ని అంతమొందించడం, పర్యావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం మొదలైన వాటికి సమాధానం దొరుకుతుంది.
అలాగే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పరిస్థితులను పరిష్కరించడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఐక్యరాజ్యసమితి 1945లో ఆమోదిం చిన చార్టర్ను పకడ్బందీగా అమలు చేస్తుందని, 21 శతాబ్దికి తగ్గట్టుగా తనను తాను పునర్నిర్మించుకుంటుందని ఆశిద్దాం.
డాక్టర్ పి.నారాయణరావు
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/