ఆధార్ సేవల కోసం అధికంగా వసూలు చేస్తే..రూ. 50,000 జరిమానా : ఐటీశాఖ
న్యూఢిల్లీః ఆధార్ సర్వీసుల కోసం ఎవరైనా ఆపరేటర్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు అతన్ని నియమించిన రిజిస్ట్రార్కు రూ.50వేల జరిమానా విధించనున్నట్లు ఐటీ మంత్రిత్వశాఖ పార్లమెంట్కు తెలిపింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సర్వీసుకు సంబంధించి అదనంగా ఛార్జీలు వసూలు చేయొద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ ఆపరేటర్లందరినీ కోరిందని ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఎవరైనా అదనంగా ఫీజులు వసూలు చేస్తే ఉడాయ్కి ఈ-మెయిల్ లేదంటే టోల్ఫ్రీ నంబర్ 1947 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
ఈ ఏడాది నవంబర్ వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్పై కేంద్ర ప్రభుత్వానికి 19.45 లక్షల ఫిర్యాదులు అందాయని.. వీటిలో దాదాపు 19.60 లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తపాలా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్న కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. బిల్లులోని నిబంధనలను ప్రైవేట్ కొరియర్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, పోస్టాఫీసుల పరిధిని విస్తరించేందుకు సమూల మార్పులు అవసరమని కేంద్రం పేర్కొంది. అవసాన దశలో ఉన్న పోస్టల్ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం కొత్త జీవం పోసిందని బీజేపీ ఎంపీ తపిర్ గావో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో పోస్టాఫీసులు ఒకదాని తర్వాత ఒకటి మూతపడేవన్నారు. తొమ్మిదేళ్లలో 6వేలకుపైగా శాఖలు ప్రారంభించినట్లు చెప్పారు.