ఆర్థిక, విద్యుత్‌శాఖల మంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు

bhatti-vikramarka-takes-charge-as-finance-and-electricity-minister

హైదరాబాద్‌ః తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయనకు సచివాలయ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి భట్టి విక్రమార్క పలు శాఖలకు నిధులు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు.

ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద రూ.374కోట్ల నిధులను మంత్రి భట్టి విడుదల చేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.298కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.996కోట్లు, మేడారం జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్ల నిధులను విడుదల చేస్తూ సంబంధిత దస్త్రాలపై భట్టి విక్రమార్క సంతకం పెట్టారు.

బాధ్యతలు స్వీకరించే ముందు మహాత్మా జ్యోతిబాఫులే ప్రజా భవన్‌లో భట్టి విక్రమార్క దంపతులు గృహ ప్రవేశం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి హోమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.