20 లక్షల మరణాలు సంభవించవచ్చు..డబ్ల్యూహెచ్ఓ

కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకపోతే మరింత వినాశనం..డబ్ల్యూహెచ్ఓ

WHO

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరించింది. ముఖ్యంగా యూరప్ లోని ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు ఈ ప్రాణాంతక వైరస్ ప్రభావంతో అతలాకుతలం అయ్యాయి. అయితే, యూరప్ దేశాల్లో కొన్నాళ్లుగా సద్దుమణిగినట్టే కనిపించిన కరోనా భూతం మళ్లీ జడలు విప్పడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్పెయిన్, ఫ్రాన్స్, పోలెండ్ దేశాల్లో కొత్త కేసులు వచ్చిన దరిమిలా అక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. బ్రిటన్, రష్యా దేశాల్లోనూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని రష్యన్లకు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిస్థితిపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ..పరిస్థితి ఇలాగే కొనసాగితే 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకపోతే మరింత వినాశనం తప్పదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ వివరించారు. గత ఆర్నెల్లుగా ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టి పీడిస్తుండగా, ఇప్పటివరకు 9.85 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 32.3 మిలియన్ల పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/