కౌశిక్ రెడ్డి తీరుపై సీఎం కేసీఆర్ కి పిర్యాదు చేసిన తుమ్మేటి సమ్మిరెడ్డి

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుపై సీఎం కేసీఆర్ కి పిర్యాదు చేసారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి. హుజురాబాద్ నియోజకవర్గ పార్టీలో నెలకొన్న విభేదాలపై, కౌశిక్ రెడ్డి తీరుపై ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఎన్నో గొప్ప పథకాలకు హుజురాబాద్ వేదికగా నిలిచిందని.. అలాంటి హుజురాబాద్ లో ప్రస్తూతం ఇంఛార్జ్ గా పని చేస్తున్న వ్యక్తి విఫలం అయ్యారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులు కేసీఆర్ కు చేరకుండా తప్పుడు సంకేతాలు చేరవేస్తున్నారని.. అందుకోసమే కేసీఆర్ కు లేఖ రాశామన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుపై విచారణ జరపాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందినప్పటికీ.. ఇక్కడి నాయకులకు గొప్ప పదవులు ఇచ్చారని, అయితే… ఇక్కడ ఆశించిన రీతిలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టడపడుతున్న వారిని పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు.

కౌశిక్ రెడ్డి తీరు కారణంగా బీఆర్ఎస్ పార్టీపై నియోజకవర్గం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ నాయకులు వర్గాలుగా ఏర్పడి.. ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుత ఇన్ చార్జ్ గురించి సమగ్ర నివేదిక తెప్పించుకుని.. విచారణ జరిపి.. కౌశిక్ రెడ్డి స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని తుమ్మేటి సమ్మిరెడ్డి లేఖలో కోరారు.