వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పూర్తిగా అవినీతిమయమైంది: ఆనం వెంకటరమణారెడ్డి

Anam Venkataramana Reddy

అమరావతి: తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…టీటీడీకు చెందిన శ్రీవాణి ట్రస్టు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడున్నా టీటీడీ ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు.

బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పూర్తిగా అవినీతిమయమైందని మండిపడ్డారు.టీటీడీ పేపర్స్ ,కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలోవిచారణ చేపడతామని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు.

మరోవైపు…ఐదేళ్లుగా విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం వేశారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్‌ అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలని ఆయన ప్రశ్నించారు.