ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత..336కు చేరిన ఏక్యూఐ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింది. బుధవారం ఉదయానికి 336కు పెరిగింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ – ఇండియా ఈ వివరాలను వెల్లడించింది.
ఢిల్లీకి పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని రైతులు తమ పంట పొలాల్లో కొయ్య కాలు కాల్చివేత (స్టబుల్ బర్నింగ్) కారణంగా వెలువడే దట్టమైన పొగలు ఢిల్లీ వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం గాలిలో తేమకు ఈ పొగ తోడు కావడంతో కాలుష్యం పెరుగుతోంది. దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉంది.