తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్ఎస్పీడీసీఎల్ శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది టీఎస్ఎస్పీడీసీఎల్. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటీస్ విడుదల చేసింది. మొత్తం 1,601 పోస్టులున్నాయి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులు 48 కాగా, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1553 ఉన్నాయి. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలతో ఈ నెల 15న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ వెల్లడించింది.

జేఎల్ఎం పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీంతోపాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల వేతన శ్రేణి రూ.24,340 నుంచి రూ.39,405 గా ఉంటుంది.

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి విషయానికి వస్తే.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టుల వేతన శ్రేణి రూ. రూ.64,295 – రూ.99,345గా ఉంటుందని అధికారులు వెల్లడించారు.