జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై లోకేష్ సెటైర్లు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తెలుగుదేశం, నేత నారా లోకేష్ సెటైర్లు వేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సోమవారం చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడలో 144 సెక్షన్‌ విధించి , పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు. దీనిపై లోకేష్ ట్విట్టర్ ద్వారా జగన్ ఫై సెటైర్లు వేశారు.

“ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లు? శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారు. మరి వారం రోజుల్లో సీపీఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి గారు? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చెయ్యండి” అని ట్వీట్ చేసాడు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సైతం ఇచ్చిన హామీలను నేరవేర్చమంటే అరెస్టులతో వేధిస్తున్నారా? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్‌ను తలపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో ఎన్నికల్లో గెలవడానికి కన్నూమిన్నూ కానకుండా హామీలిచ్చారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.