టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..ప్రయాణికులు ఫుల్ హ్యాపీ

ప్రవైట్ ట్రావెల్స్ కు దీటుగా టీఎస్ఆర్టీసీ ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకుంటూ వస్తుంది. ముఖ్యంగా సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీఎస్ఆర్టీసీ లో పలు మార్పులు , ఆఫర్లు , సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తూ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరింత దగ్గర చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆఫర్ల ను తీసుకొచ్చిన టీఎస్ఆర్టీసీ ..ఇప్పుడు మరో తీపి కబురు తెలిపింది.

అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నవారికి బస్సు టికెట్‌ ఛార్జీలో ప్ర‌త్యేక రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ఛార్జీలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అలాగే 46 రోజుల నుంచి 60 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ఛార్జీలో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో శుభ‌కార్యాలు, పెళ్లిళ్లు, పండుగ‌లు ఎక్కువ‌గా ఉండటంతో.. ఎక్కువగా బుకింగ్స్ కావడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు చెబుతున్నారు.

ఈ మేరకు దీనికి సంబంధించి సజ్జనార్ ట్వీట్ చేశారు. అయితే సంక్రాంతి సంద‌ర్భంగా ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు టీఎస్‌ఆర్టీసీ పెంచింది. దీంతో 60 రోజులు ముందుగానే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు ఈ సదుపాయం కల్పించారు. దీనిపై ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన వస్తుందని, ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.