కోకాపేట్ భూముల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్: హైదరాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కోకాపేట్ నియోపోలీస్ లోని భూముల వేలానికి HMDAకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 239, 240 సర్వే నంబర్లలోని భూమిపై హక్కులు పూర్తిగా ప్రభుత్వానివేనని నిర్ధరణ అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెంట్గా హెచ్ఎండీఏ భూముల ఈ-వేలం నిర్వహించిందన్న ప్రభుత్వం.. వేలంలో భూములు కొన్న బిడ్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐటీ కారిడార్లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ ఏడాది జులైలో ఆన్లైన్లో నిర్వహించిన వేలం కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లు హాట్కేక్లుగా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ వేలంలో మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు.
ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ గల ప్లాట్ను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతంచేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో హైదరాబాద్లో అత్యంత విలువైన భూమిగా కోకాపేటకు మరోసారి గుర్తింపు వచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/