బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు : సీఎం కెసిఆర్
హైదరాబాద్: సీఎం కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చకు సీఎం కెసిఆర్ సమాధానమిస్తూ మాట్టాడారు. తన ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్న సభ్యులకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో చట్టసభల్లో జరగవలసిన చర్చల సరళి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. యువ నాయకత్వానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సక్రమైన చర్చలు జరిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని కెసిఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తారు. పసలేని, పనికిమాలిన బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తాయి.. ఈ విమర్శలు సహజమని కేసీఆర్ అన్నారు.
బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం అన్నట్టు, అంకెలు మాత్రమే చెప్తరు అన్నట్టు మన దేశంలో ప్రబలి ఉందన్నారు. పార్లమెంట్లో కానీ, వివిధ రాష్ట్రాల బడ్జెట్ల్లో కానీ రెండు విషయాలు గమనిస్తాం. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతారు. అద్భుతమైన బడ్జెట్ అని అధికార సభ్యులు, పసలేని, పనికిమాలిన బడ్జెట్ అని విపక్ష సభ్యులు అంటారు. ఈ అభిప్రాయంలో మార్పు లేదు. సీట్లు మారినా కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు. ఈ సమకూర్చబడ్డ నిధులను ఎలా ఉపయోగించాలనేది కూడా ప్రధానం అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. మొట్టమొదటి దేశ బడ్జెట్ 190 కోట్లు.. దాంట్లో 91 కోట్లు రక్షణ రంగానికే. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివేటప్పుడు చెన్నారెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఏపీ బడ్జెట్ 680 కోట్లు. ఇప్పుడేమో లక్షల కోట్లలో మాట్లాడుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలా సమకూర్చుకున్న నిధులపై అభివృద్ధి ఆధారపడి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/