ఆఖరి దశకు చేరుకున్న వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

స్వయంగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

trump

వాషింగ్టన్‌: కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అమెరికాలో మూడో దశకు చేరుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆఖరి దశకు చేరుకున్న వ్యాక్సిన్ లలో ఇది కూడా వుందని ఆయన అన్నారు. అమెరికా ఇప్పటివరకూ అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను చేసి చూపిందని, కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ విజయం సాధిస్తామని అన్నారు. ఇదిలావుండగా, అమెరికాలోని 80 నగరాల్లో 30 వేల మంది వాలంటీర్లపై ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించనుంది.

18 ఏళ్ల పైబడిన వివిధ జాతులు, సంస్కృతులు, దేశాలకు చెందిన వారు ఈ వాలంటీర్లలో ఉన్నారు. హెచ్ఐవీ వంటి వ్యాధులున్నవారిపైనా ఈ దశలో వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారు. అంతే కాదు… కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న వారిని కూడా చేర్చామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించింది. కాగా, జనవరి 2021లో వ్యాక్సిన్ ను ప్రజలకు అందించాలని అమెరికా కంకణం కట్టుకుని శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. తొలి దశలో 30 కోట్ల డోస్ లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం యూఎస్ లో ఆక్స్ ఫర్డ్ఆస్ట్రాజేనికా వ్యాక్సిన్ తో పాటు మోడెర్నా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాలు కూడా ప్రయోగ దశలో ఉన్నాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/