జర్మనీలో మళ్లీ కరోనా కలకలం

జర్మనీలో నిన్న 39 వేలకు పైగా కేసులు
ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు


బెర్లిన్: జర్మనీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేలా ఉంది. నిన్న ఒక్కరోజే జర్మనీలో 39 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. దేశంలోని ఆసుపత్రులకు తరలి వస్తున్న కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. ఐసీయూల్లో ఖాళీలు లేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా వచ్చే రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోలేకపోతున్నామని అక్కడి వైద్య సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది మొత్తం కరోనా రోగుల బాగోగులు చూసుకోవడానికి సరిపోతున్నారని, ఇతర కేసుల్లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించలేకపోతున్నామని ఓ ఆసుపత్రి యజమాన్యం వాపోయింది.

కాగా, జర్మనీలో కరోనా మళ్లీ ఈ స్థాయిలో విజృంభించడానికి ఇంకా చాలామంది వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. కొత్త కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే దేశంలో లాక్ డౌన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/