కేటీఆర్ కు షాక్ ఇచ్చిన సొంత నేతలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. మంగళవారం గద్వాల జిల్లాలో కేటీఆర్ పర్యటించబోతున్నారు. అలంపూర్ చౌరస్తా లో వంద పడకల ఆసుపత్రి భూమి పూజకు కేటీఆర్ హాజరుకానున్నారు . ఈ నేపథ్యం లో మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. కేటీఆర్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లు, సింగిల్ విండో, మార్కెట్ యార్డ్ మెంబర్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

అలంపూర్‌కు మంజూరు అయిన 100 పడకల ఆస్పత్రిని అలంపూర్ చౌరస్తా కు తరలించడం పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కేసీఆర్ అలంపూర్‌కు 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తే కొందరు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అలంపూర్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరస్తాకు తరలించడం అన్యాయమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా అలంపూర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ మేరకు ఆదివారం అలంపూర్ బంద్ కూడా నిర్వహించామని తెలిపారు. దీంతో మంత్రి కేటీఆర్ రేపటి పర్యటన పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.