రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

రేపు నూతన సచివాలయం ప్రారంభోత్సవం

Traffic restrictions in Hyderabad

హైదరాబాద్‌ః రేపు సిఎం కెసిఆర్‌ చేతుల మీదుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయ భవనం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. ఆదివారం ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్‌ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్‌ డోర్లకు అతికించుకోవాలని సూచించారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

.ఆఫ్జల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌కు ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ నుంచి కట్టమైసమ్మ ఆలయం లోయర్‌ ట్యాంక్‌బండ్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ వైపునకు వెళ్లాలి.
.ఖైరదాబాద్‌, పంజాగుట్ట, సోమాజిగూడ వైపు నుంచి నెక్లెస్‌ రోటరీవైపు అనుమతి లేదు. ఈ వాహనాలను వీవీ విగ్రహం చౌరస్తా నుంచి సాదన్‌ కాలేజీ, నిరాంకరి వైపు మళ్లిస్తారు.
.నిరాంకరి చింతలబస్తీ వైపు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలకు ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా వెళ్లేందుకు వీలు ఉండదు.
.లిబర్టీ వైపు నుంచి తెలుగు తల్లి, అంబేద్కర్‌ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్‌ వైపు అనుమతి లేదు. ఈ వాహనాలు నేరుగా ఫ్లై ఓవర్‌ మీదకు వెళ్లి అక్కడి నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వెళ్లాలి.
.ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌వైపు మళ్లిస్తారు.
.బీఆర్‌కే భవన్‌ వైపు నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌కు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
.బడా గణేశ్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను బడా గణేశ్‌ నుంచి రాజ్‌దూత్‌ లైన్‌కు మళ్లిస్తారు.