బక్రీద్ సందర్భంగా.. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

బక్రీద్‌ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు (జూన్ 29) హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు దీనికి సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు చూస్తే..

  • పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య ఈ రూట్లలో అనుమతిస్తారు.
    ఈ వాహనాలను జూ పార్కు, మసీద్‌ అల్హా హో అక్బర్‌ ఎదురుగా పార్కు చేయాలి.
  • సాధారణ ట్రాఫిక్‌కు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపూరా, పురానాపూల్‌ వైపు మళ్లిస్తారు.
  • శివరాంపల్లి, ధనమ్మ హట్స్‌ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్‌ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఈద్గా వైపు అనుమతించరు. ఈ వాహనాలు ధనమ్మ హట్స్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి శాస్త్రిపురం, ఎన్‌ఎస్‌కుంట రూట్లలో వెళ్లాలి.
  • ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే వాటిని పురానాపూల్‌ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
  • ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్‌ జంక్షన్‌ వద్ద నుంచి మళ్లిస్తారు.
  • కాలాపత్తర్‌ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్‌ ఠాణా వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు, సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు.