టెట్‌ దరఖాస్తులకు ఈరోజుతో గడువు ముగింపు

today-is-last-date-for-telangana-state-teacher-eligibility-test-ts-tet-application

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తులకు ఈరోజుతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం (ఆగస్టు 15) నాటికి మొత్తం 14 రోజుల వ్యవధిలో దరఖాస్తుల సంఖ్య 2.40 లక్షలు దాటింది. ఇవాళ ఆఖరిరోజు కావడంతో మరో 10 వేలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. 2022లో దాదాపుగా 6.27 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాగా, దరఖాస్తులు తక్కువ అయినప్పటికీ ఈసారి ఇప్పటికే ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు. హైదరాబాద్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కొత్తగూడెం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు నిండిపోయాయి. కొత్తగా దరఖాస్తు చేసేవారికి ఆ జిల్లాల్లో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునే వీలుండదు. దాంతో అధికారులు తగినన్ని పరీక్షా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.