బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తోట చంద్రశేఖర్
జనసేన పార్టీ కీలక నేత తోట చంద్రశేఖర్ సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈయన తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు టీజే ప్రకాశ్(అనంతపురం), తాడివాక రమేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్రధాన కార్యదర్శి), రామారావు(ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అయిన తోట చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 లో జనసేన అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీమంత్రి అయిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరులోని ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2019లో జనసేనలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చింతల పార్థసారథి 2019లో అనకాపల్లి ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఈ చేరికల కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.