పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందిః మంత్రి ఉత్తమ్

ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతాయని ఆశాభావం

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌ః సర్పంచ్‌ల బిల్లులు ఆపిందే గత బిఆర్ఎస్ ప్రభుత్వమని… కానీ ఇప్పుడు వారి తరఫున పోరాడుతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్‌లు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్నారు. ఇందుకు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లు నిదర్శనమన్నారు. వీరు సుదీర్ఘకాలం పార్టీలో పని చేస్తున్నారన్నారు. విద్యార్థి దశ నుంచే వారు కాంగ్రెస్ పక్షాన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు వారి కష్టానికి, త్యాగానికి సరైన ఫలితం దక్కిందన్నారు. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.