భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ నూతన గవర్నర్

తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టులో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బుధువారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తి లోక్‌ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన యాదగిరిగుట్టకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు. ఆలయ అర్చకులు గవర్నర్‌కు వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత సాయంత్రం గవర్నర్ కుటుంబసమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.