ఉగ్రవాదం పాకిస్థాన్ ప్రధాన సమస్యల్లో ఒకటి: పాక్ ప్రధాని

పోలీస్ వ్యాన్ పై ఉగ్రదాడిని ఖండించిన షెహబాజ్ షరీఫ్

Terrorism one of Pakistan’s foremost problems: PM Shehbaz

ఇస్లామాబాద్‌ః పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్యలలో అన్నింటికంటే ప్రధానమైనది ఉగ్రవాదమేనని ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దేశాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. ఖైబర్ ఫక్తుంఖ్వాలో పోలీస్ వ్యాన్ పై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని ఖండించారు. ఈ సందర్భంగా దాడిలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడంలేదని చెప్పారు. ఉగ్రవాదంపై అత్యంత సాహసంతో పోరాడుతున్నారని పోలీసులు, సైనికులను ఆయన కొనియాడారు. ఈమేరకు ప్రధాని షరీఫ్ బుధవారం ట్వీట్ చేశారు.

ఖైబర్ ఫక్తుంఖ్వాలోని లాకీ మార్వాత్ లో ఓ పోలీస్ వ్యాన్ పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫక్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/