హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత

తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్‌‌దళ్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్ణాటక ఎన్నికల వేళ భజరంగ్‌‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భజరంగ్‌‌దళ్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ మేనిఫేస్టోకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, భజరంగ్ దళ్ నేతలు ఆందోళనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్యబద్దంగా హనుమాన్ చాలీసా పఠనం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు వారు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్దకు పెద్ద ఎత్తున భజరంగ్‌దళ్, బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. గాంధీ భవన్ ముందు బైఠాయించి హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు యత్నించారు. అయితే గాంధీ భవన్‌ వద్దకు చేరుకున్న భజరంగ్‌దళ్, బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, భజరంగ్‌దళ్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై భజరంగ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.