విశాఖ నుంచి తరిమేసిన లులూకు తెలంగాణ స్వాగతం పలికిందిః గంటా శ్రీనివాసరావు

లులూను ఏపీకి తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్న గంటా

Ganta Srinivasa Rao
ganta-srinivasa-rao

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి భుత్వంపై టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి ప్రఖ్యాత లులూ సంస్థను తరిమేశారని ఆయన విమర్శించారు. మీకొక వందనం… ఇక్కడ ఉండలేం… అని చెప్పి వెళ్లిపోయిన ‘లులూ’కు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఘన స్వాగతం పలికిందని చెప్పారు. సీఎం జగన్ ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం’తో విసిగిపోయిన ‘లులూ’ అసలు ఏపీలో పెట్టుబడులే పెట్టమని చెప్పేసిందని… మీ రివర్స్‌ పాలన వలన విశాఖలో 5 వేల మంది యువతకి ఉపాధిని దూరం చేశారని మండిపడ్డారు. గత సంవత్సరం లులూతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అతి పెద్ద మాల్ ను ఘనంగా హైదరాబాద్ లో ప్రారంభించుకుందని చెప్పారు.

“మీరు ఏపీలో కొత్తగా పెట్టుబడులు సాధించలేరు. అప్పటికే వచ్చిన ప్రాజెక్టులను కాపాడుకోలేరు. మీరు అధికారంలోకి వచ్చీ రాగానే మీ రివర్స్ పాలనలో ‘లులూ’ను కూడా ‘రివర్స్‌’ బాట పట్టించారు. చంద్రబాబు నాయుడు లులూ గ్రూప్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి చాలా కృషి చేశారు. ఎన్నో సంప్రదింపులు జరిపి, నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్ ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించారు.

2018లో విశాఖలో రూ. 2000 కోట్ల పెట్టుబడితో షాపింగ్‌మాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేలా ఎంవోయూ చేసుకొని, శంకుస్థాపన కూడా చేశారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం’తో విసిగిపోయిన ‘లులూ’ అసలు ఏపీలో పెట్టుబడులే పెట్టమని చెప్పడంతో… పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్‌ కార్పెట్‌ పరిచి లులూకు స్వాగతం పలికాయి. మన రాష్ట్రంలో బాధ్యత లేని ఇలాంటి చర్యల వలన వ్యాపార అనుకూల వాతావరణాలన్నీ దెబ్బతిన్నాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి… విజన్ కు ఉన్న విలువను, విధ్వంసం తెచ్చే వినాశనాన్ని తెలుసుకోండి. 2024లో మన రాష్ట్ర భవిష్యత్ ను మీ ఓటు అనే ఆయుధంతో రక్షించండి” అని గంటా చెప్పారు.