టిఆర్ఎస్ పార్టీ 15 రోజుల్లో హామీలను అమలు చేయాలి – బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. మునుగోడు ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని, గెలుపునకు పొంగిపోమని, ఓటమికి క్రుంగిపోమన్నారు. మునుగోడు ప్రజలకు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను సీఏం కేసీఆర్ 15 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఎన్ని రకాలుగా బెదిరించినా వీరోచితంగా పోరాడిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు టీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎంత విర్రవీగుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని సీఏం కేసీఆర్ టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని, వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరగలరా అని ప్రశ్నించారు. మునుగోడు గెలుపు కేసీఆర్‌దా.. కేటీఆర్‌దా.. హరీశ్‌రావుదా, సీపీఐదా, సీపీఏందా లేకపోతే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదా.. ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల లోపు మెజార్టీ మాత్రమేనని తెలిపారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తే.. బీజేపీ తరఫున ఓ సామాన్య కార్యకర్త పనిచేశారని, ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. తమ పార్టీ కార్యకర్తతో సమానమన్నారు.