ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్.. దసరా కానుకగా.. అక్టోబర్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10 వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ‘‘ ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందించాలని నిర్ణయించారు.

ఈ పథకం ద్వారా విద్యార్థులకు మంచి బోధనతో పాటు.. ఆరోగ్యకరమైన పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనున్నది. అలాగే, ఈ పథకం ద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెల్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రటించారు.

ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలోనూ విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఈ పథకం అమలు అవుతున్న విధానాన్ని పరిశీలించాలని ఐఏఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఇటీవలే పంపించారు. తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం’ పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చింది. కాగా తమిళనాడులో మాదిరిగా కాకుండా.. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. కాగా, ఈ పథకం అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడనుంది.